ఓం నమో నారాయణాయ||
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీ కృష్ణ జన్మాష్టమి అని అంటారు. శ్రీ కృష్ణుని జననం ఆయన జీవితం అద్భుతం! చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపికా వల్లభుడు, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు, ఉత్తర ప్రదేశ్ లోని మధురలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతుంటారు. అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి మరి వాటిని కొడతారు.
శ్రీకృష్ణ జననం:
పురాణాల ప్రకారం మధురను పాలించే ఉగ్రసేనుడు వృద్ధుడు కావడంతో రాజ్యకాంక్షతో అతని కుమారుడు కంసుడు తన తండ్రిని కారాగారంలో బంధించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కంసుడు తన సోదరి దేవకిని యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేశాడు. సోదరి అంటే ఎంతగానే ప్రేమించే కంసుడు, ఆమెను పెళ్లైన తరువాత అత్తవారింటికి పంపేందుకు తానే స్వయంగా రథం నడుపుతూ తీసుకువెళుతుంటాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఆమెకు పుట్టే ఎనిమిదో సంతానం వల్ల నీకు ప్రాణగండం ఉంది, అదే నీ అంతం అని పలికింది.
ఒక్కసారిగా ఉగ్రుడైన కంసుడు… ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన అష్టమ సంతానానికి ఎలా జన్మనిస్తుందో చూస్తాను అని హూంకరించి అక్కడే కత్తి తీసి దేవకి తల నరకబోతుంటే వసుదేవుడు కంసుడిని వేడుకుంటాడు. “దయచేసి ఆమె ప్రాణం తీయకు, ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లని చంపవచ్చు. దయచేసి నా భార్యను వదిలిపెట్టు’ అని వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి కొంతమందిని కాపలా ఉంచుతాడు.
తొలి సంతానం పుట్టగానే కాపలాదారులు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు.. ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమమని ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎంతగా ప్రాధేయపడినా, ఎవరినీ ప్రాణాలతో వదిలేయక హతమార్చాడు.
ఒకనాడు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా అష్టమ సంతానానికి దేవకి జన్మనిచ్చింది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావించి వెంటనే ఆ బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది.

వసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలావాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు.
ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంప గలిగేవాడేమో కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్ధిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారి ఎగిరి బయటకు వెళ్లి నిన్ను చంపేవాడు వేరొకచోట క్షేమంగా ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు, రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం.