అయోధ్యలోరామమందిర నిర్మాణానికి భూమి పూజ…

అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి దాదాపు ముహూర్తం ఖరారయ్యింది. ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జరపాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సమావేశమై శంకుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆగ‌స్టు 3వ తేదీన పూజ‌లు ప్రారంభంకానున్నాయి. ఆగ‌స్టు 4వ తేదీన రామాచార్య పూజ నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 5న మ‌ధ్యాహ్నం 12.15 నిమిషాల‌కు భూమిపూజ చేప‌ట్ట‌నున్నారు. భూమిపూజ కోసం అయిదు వెండి ఇటుక‌ల‌ను కూడా వాడ‌నున్నారు. తొలి ఇటుక‌ను మోదీ పేర్చ‌నున్నారు.

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ‌(వీహెచ్‌పీ) ఇచ్చిన నమూనా ప్ర‌కార‌మే ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు. అష్ట‌భుజ ఆకారంలో గ‌ర్భాల‌యం ఉంటుంది. గ‌తంలో ఇచ్చిన నమూనా క‌న్నా ఆల‌యం ఎత్తు, వైశాల్యం, పొడుగును పెంచారు. ముందుగా అనుకున్న మూడు గోపురాల స్థానంలో అయిదు గోపురాల‌ను నిలుపనున్నారు. ఆల‌య విస్తీర్ణం సుమారు 76 వేల చ‌ద‌ర‌పు గ‌జాల నుంచి 84వేల చ‌ద‌ర‌పు గ‌జాలు ఉంటుంది. తొలుత కేవ‌లం 38వేల చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఆల‌యాన్ని నిర్మించాల‌నుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యే అతిథుల్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, ఆర్ఎస్ఎస్ అధినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్‌, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరియు పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా రామాల‌య ఉద్య‌మంలో శివ‌సేన పాత్ర ఉన్న కార‌ణంగా ఆ పార్టీకి కూడా ఆహ్వానం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మార్చి నెల‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ద‌వ్ థాకేరే అయోధ్య‌ను సందర్శించి ఆల‌య నిర్మాణం కోసం కోటి రూపాయ‌ల విరాళాన్ని కూడా ప్ర‌క‌టించారు.